తరగతి గదిలో అంతా నిశ్శబ్దం, ఒకవైపు ఉపాధ్యాయుడు గాంధీ వైపు కోపంగా చూస్తున్నాడు, చుట్టూ ఉన్న తన స్నేహితులు తనను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. ఆ నవ్వులో ఒక రకమైన అవమానం కనిపిస్తుంది. వారి చూపులు గాంధీ ని అమాయకుడిని చేస్తున్నాయి. కానీ గాంధీజీ మాత్రం తన సహనం ఏ మాత్రం కోల్పోలేదు, తాను చేసింది ఒప్పే అని , తాను ఏ తప్పు చేయలేదన్నట్లుగా తెలియపరిచే భావాలను తన ముఖంలో చూపిస్తున్నాడు.
అది గాంధీ హైస్కూల్ చేరిన మొదటి సంవత్సరం. అప్పుడు తరగతి గదిలో పరీక్షలు జరుగుతున్నాయి. గాంధీ తన పరీక్షలో వ్రాయటం లో మునిగిపోయాడు, చాలా శ్రద్దగా పరీక్షలు రాస్తున్నాడు. ఇంతలోనే విద్యాశాఖకు చెందిన జెయిల్స్ అనే అధికారి అకస్మాత్తుగా తరగతిగది లోకి ప్రవేశించాడు. అతన్ని చూసిన విద్యార్థులకు చెమటలు పట్టాయి. ఆ వెంటనే ఆ అధికారి విద్యార్థులు అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఐదు పదాలను రాయమని చెప్పాడు. వాటిలో కేటిల్ [kettle] అను పదం ఒకటి. దురదృష్టవశాత్తు గాంధీ ఈ పదాన్ని తప్పుగా వ్రాసాడు. ఇది చూసిన తన తరగతి ఉపాధ్యాయుడు గాంధీజి కి సైగ చేసాడు. కానీ గాంధీ కి ఉపాధ్యాయుడు ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేదు. వెంటనే ఉపాధ్యాయుడు తన బూటు కాలితో నొక్కి తప్పును సరిదిద్దుకోమని , మరొక్క సరి సైగ చేసాడు. కానీ గాంధీ కి మాత్రం ఉపాధ్యాయుడి ప్రవర్తన అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పు దిద్దుకోమని సైగ చేస్తున్నారన్న విషయం గాంధీ తెలుసుకోలేకపోయాడు. ఎదుటి వారి పలక నుండి చూసి రాయకుండా ఉండేందుకే ఉపాద్యాయుడు అక్కడ ఉన్నారని గాంధీజి భావన. అటువంటి ఉపాధ్యాయుడే తప్పు చేయమని ప్రోత్సహించటం గాంధీ కి నచ్చలేదు. మిగతా పిల్లలంతా ఆ ఐదు పదాలు సరిగ్గా వ్రాసారు, గాంధీ ఒక్కడు మాత్రం ఆ అధికారి చేత తిట్లు తినవలసి వచ్చింది.
ఆ తరువాత ఆ ఉపాధ్యాయుడు గాంధీజీ ని పిలిచి మందలించాడు. తన అమాయకత్వాన్ని ,తనకు తెలియచేసాడు. కానీ గాంధీజీ కి మాత్రం ఉపాధ్యాయుడి ప్రవర్తన వింతగా తోచింది. ఈ సంఘటన జరిగిన తరువాత కూడా గాంధీజీ కి ఆ ఉపాధ్యాయుడి పై ఏ మాత్రం గౌరవం తగ్గలేదు. పెద్దల దోషాల్ని చూసి కళ్ళు మూసుకోవాలని గాంధీజి భావన . ఆ తరువాత చాలా సార్లు ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తన గురుంచి , అతడి దోషాల గురుంచి గాంధీజీ దృష్టికి వచ్చిన అతనిపై ఏ మాత్రం వినయం తగ్గలేదు గాంధీజీ కి .
సామాన్యంగా అందరూ బతకగలరు, కానీ తాను నమ్మిన సిద్దాంతాలను ఆచరిస్తూ, వాటిని
తన జీవితం లోకి అన్వయించుకుంటూ బతకగలటం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది ,
అటువంటి వారే మహాత్ములుగా చరిత్ర పుటల్లో శిఖరాగ్రాన నిలిచి , జాతికి ఆదర్శం అవుతారు. చిన్నతనం లో జరిగిన ఆ సంఘటన గాంధీజీని మానసికంగా మరింత బలవంతుడిని చేసింది, సత్యానికి మరింత దగ్గరివాడ్ని చేసింది. అంత చిన్న వయసులో కూడా పక్క వారు ప్రేరేపించినా, తప్పు చేయాలన్న చిన్న తలంపు కూడా గాంధీజీ కు కలగలేదు. అందుకే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ , మహాత్మా గాంధీ అయ్యాడు.కొన్ని కోట్ల మంది కలలు కన్న స్వేఛ్ఛా భారతాన్ని సాధించి పెట్టాడు.



No comments:
Write comments